Telangana elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ప్రధాని మోడీ పైనే బీజేపీ నేతల ఆశలు.. !
Narendra Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు బీజేపీ అగ్రనాయకులు కాషాయ పార్టీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
![Telangana elections 2023: BJP leaders pin hopes on Narendra Modi last leg of election campaign RMA Telangana elections 2023: BJP leaders pin hopes on Narendra Modi last leg of election campaign RMA](https://static-ai.asianetnews.com/images/01hfr5m97sat66qn6e3n42w5kb/PM--narendra-modi-Mega-Road-Show-1700544521465_363x203xt.jpg)
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఎన్నికల పోలింగ్ కు సమయం చాలా తక్కువగానే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ లతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాస్త వెనుకబడి ఉందని చెప్పాలి. అయితే, ఈ వారంలో బీజేపీ ఆ పార్టీ అగ్రనాయకులను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర కాషాయ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీపై ఆశాలు పెట్టుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు బీజేపీ అగ్రనాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఏకంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేయనున్నారు.
గత 20 రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వివిధ రాజకీయ పరిణామాల కారణంగా పార్టీ పుంజుకుందనీ, గత కొన్ని నెలలుగా ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. 20కి పైగా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని అంటున్నారు. ఈ నెల 26న నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించడం, గత సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడం వంటి పలు కీలక ప్రకటనలు నిర్మల్ సభలో కూడా మోడీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.
తెలంగాణకు పార్టీ కో-ఇంఛార్జిగా ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి సమావేశాలు పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు సహాయపడతాయని అన్నారు. మూడు జిల్లాల నుంచి అత్యధిక మద్దతుదారులను రప్పించడం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం కోసం భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆయన పార్టీ నాయకత్వం యోచిస్తోంది. మూడు జిల్లాల నుంచి 10-12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
బీసీ నేతలను సీఎం అభ్యర్థులుగా ప్రకటించడం, ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడం వల్ల గత 15 రోజులుగా పార్టీకి మద్దతు పెరుగుతున్నదని అరవింద్ మీనన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 20-25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కె. అంజుకుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్వేల్లో తమ ఓట్ల శాతం కూడా పెరిగిందనీ, బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించి ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకడంతో అదనంగా 11-12 శాతం మంది ఓటర్లు బీజేపీకి మద్దతిచ్చారన్నారు.