Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తాము ప్ర‌క‌టించిన ఆరు హామీల్లో రెండు ఇప్ప‌టికే అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.  

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క తాజాగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ రెండు హామీలను నెరవేర్చిందనీ, 100 రోజుల్లో మొత్తం ఆరు హామీలను నెరవేరుస్తామని తెలంగాణ తెలిపారు. మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఖమ్మం చేరుకున్న ఆయనకు వారి మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న భ‌ట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన నాలుగు హామీలను నెరవేరుస్తుందని అన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజాప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఉద్ఘాటించారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి త‌మ మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిలో భాగంగా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచామన్నారు. దీంతో రెండో హామీని నెరవేర్చామని తెలిపారు. రెండు హామీలను తక్షణమే అమలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు చెంపపెట్టు లాంటిదనీ, వారి హామీలకు హామీ లేదని దుయ్యబట్టారు.

ఇళ్లు, పోడు భూముల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జర్నలిస్టులు ఎనలేని బాధలు పడ్డారనీ, సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్‌దేనని డిప్యూటీ సీఎం అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అద్భుతంగా గెలిపించినందుకు ఖమ్మం ప్రజలకు విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ పాల‌న‌ను అస్తవ్యస్త పాలనగా భట్టి తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడిందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను ప్రజల కోసమే తీర్చిదిద్దుతామన్నారు.