Telangana: విద్యుత్ చార్జీల పెంపును నిరశిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నిరసనలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిందించింది. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Telangana Congress protests: ఇటీవల పెంచిన విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో భారీ నిరసన చేపట్టారు. గురువారం నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, మల్లు రవి, మధు యాస్కీ, శ్రీధర్ బాబులతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి ఖైరతాబాద్లోని తెలంగాణ విగ్రహం నుండి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే విద్యుత్ శాఖ కార్యాలయంలోకి బారికేడ్లు వేసి లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొట్టి విద్యుత్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
దీనికి కొనసాగింపుగా శుక్రవారం కూడా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ.. ఆందోళనకు దిగాయి. పెంచిన విద్యుత్ చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారుపై కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు. నిత్యం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతూ.. ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయనీ, అయినప్పటికీ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు.
కాగా, అంతకు ముందు పెరిగిన ధరలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు సాగు చేసిన వరి రైతుకు అన్యాయం చేస్తూ... కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని సీఎం కే చంద్రశేఖరరావు పేద రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇది సబ్కా సాథ్ కాదు సబ్కా సత్యనాష్ మరియు విశ్వాసఘాత్ పాలన అంటూ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక గురువారం నిర్వహించిన విద్యుత్ చార్జీల పెంపు నిరసనల నేపథ్యంలో విద్యుత్ సౌధ వద్ద మొదట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఆ తర్వాత అధికారులు అనుమతించడంతో వారిని కలిసి మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. “మేము విద్యుత్ ఛార్జీల పెంపు గురించి తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడాము. ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇకపై అలా జరగనివ్వదు. అధికారుల తప్పిదాలు, ప్రభుత్వ తప్పిదాల వల్లే విద్యుత్ చార్జీలు పెరిగాయి. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం, పార్లమెంటులో పోరాడాం, రోడ్డుపై కూడా పోరాడతాం. విద్యుత్ పెంపుపై హైకోర్టుకు కూడా వెళ్తాం. వారిపై ఇంటెలిజెన్స్ నిఘా ఉంది కాబట్టి అధికారి ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరు” అని రేవంత్ రెడ్డి తెలిపారు. కరెంట్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని భట్టి విక్రమార్క అన్నారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో, ఓవర్లోడ్ పేరుతో సామాన్యులు భరించలేని విధంగా భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
