కేసీఆర్ ఎఫెక్ట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఎమర్జెన్సీ మీటింగ్
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్లో జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్లో జరగనుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్టుగా సంకేతాలు ఇస్తోంది.దరిమిలా తమ పార్టీ క్యాడర్ను కూడ ఎన్నికలకు సన్నద్దం చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మాజీ డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యదర్శులతో పాటు కాంగ్రెస్ పార్టీకిచెందిన కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారరు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా కూడ సిద్దంగా ఉండాలని ఆ పార్టీ నాయకులకు కుంతియా దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.