అద్దంకి ఔట్: బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లకు ఎమ్మెల్సీ టిక్కెట్లిచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
![Telangana Congress Announced Balmoori Venkat and Mahesh kumar Goud name As MLA quota MLC Candidates lns Telangana Congress Announced Balmoori Venkat and Mahesh kumar Goud name As MLA quota MLC Candidates lns](https://static-ai.asianetnews.com/images/01fmkwkmvj04wj667sbwcdp6w6/mlc-polls-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియం శ్రీహరిలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులుగా గత ఏడాది డిసెంబర్ 30న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు వీరిద్దరూ రాజీనామా చేశారు.దరిమిలా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుకుల ఎన్నికలసంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేది.
అయితే ఈ నెల 16వ తేదీన బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ లకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్లను కేటాయించినట్టుగా ప్రచారం సాగింది. ఇవాళ ఈ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే అనుహ్యంగా అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరమీదికి వచ్చింది.ఈ ఇద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
also read:భారత్లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే....
గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి అద్దంకి దయాకర్ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ దఫా కూడ తుంగతుర్తి అసెంబ్లీ టిక్కెట్టు ఆశించారు అద్దంకి దయాకర్. అయితే అద్దంకి దయాకర్ కు కాకుండా మందుల సామేల్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. మందుల సామేల్ ఈ స్థానం నుండి విజయం సాధించారు.
also read:కవితకు ఈడీ నోటీసులు: తెలంగాణలో రాజకీయ చర్చ, ఎందుకంటే?
గతంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా కూడ హుజూరాబాద్ టిక్కెట్టు ఆశించారు. కానీ హుజూరాబాద్ టిక్కెట్టు వెంకట్ కు ఇవ్వలేదు. తుంగతుర్తి అసెంబ్లీ టిక్కెట్టు కూడ అద్దంకి దయాకర్ కు దక్కలేదు. కానీ, అద్దంకి దయాకర్ పేరు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ జాబితా నుండి తొలగింది. అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ స్థానం దక్కింది.
థావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఐదు రోజుల తర్వాత హైద్రాబాద్ కు రానున్నారు. నామినేటేడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటారు.అద్దంకి దయాకర్ కు నామినేటేడ్ పదవి దక్కుతుందా లేకపోతే గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అద్దంకి దయాకర్ పేరును సిఫారసు చేస్తారా అనే విషయమై సీఎం హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత తేలనుంది.
ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు వేర్వేరుగా నోటిఫికేషన్లను ఈ నెల 12న ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసెంబ్లీలో సీపీఐ అభ్యర్ధితో కలుపుకుని కాంగ్రెస్ కు 65 మంది బలం ఉంది. దీంతో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి.