నాకు భిక్ష పెట్టేవాడైతే.. ఆయనే సీఎం అవుతాడుగా: పెద్దలు జానారెడ్డిపై కేసీఆర్ సెటైర్లు
జానారెడ్డి మాట్లాడితే 30 ఏళ్ల అనుభవం అంటారని.. కానీ టీఆర్ఎస్ వచ్చేదాకా నందికొండ మున్సిపాలిటీని పట్టించుకోలేదంటూ ముఖ్యమంత్రి ఆరోపించారు.
జానారెడ్డి మాట్లాడితే 30 ఏళ్ల అనుభవం అంటారని.. కానీ టీఆర్ఎస్ వచ్చేదాకా నందికొండ మున్సిపాలిటీని పట్టించుకోలేదంటూ ముఖ్యమంత్రి ఆరోపించారు. నందికొండలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వివాదాలను తానే స్వయంగా పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తనకు ముఖ్యమంత్రి పదవి బిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు కానీ జానారెడ్డి కాదంటూ ఆయన స్పష్టం చేశారు. సీఎం పదవి భిక్ష పెట్టేవాడైతే.. అతనే సీఎం అవుతాడు కదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బిచ్చగాళ్ల లాగా పదవుల కోసం వంగి పెదవులు మూసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడే తన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గులాబీ జెండా ఎగురవేశానని కేసీఆర్ గుర్తుచేశారు.
ఉద్యమంలో తాను వెనకడుగు వేస్తే.. రాళ్లతో కొట్టి చంపమన్నానని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు చక్కగా వుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరిందని ఆయన ప్రశ్నించారు. పదవుల కోసం తెలంగాణను ఆంధ్రోళ్లకు వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే.. స్వరాష్ట్రం కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్ అని సీఎం వెల్లడించారు.
Also Read:మోడీ ఐదు రాష్ట్రాల్లో తిరిగాడు.. నేను హాలియాలో సభ పెట్టకూడదా : విపక్షాలపై కేసీఆర్ విమర్శలు
ప్రజలకు 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. మీ గ్రామాల్లో కళ్యాణలక్ష్మీ, రైతు బీమా, రైతు బంధు వస్తుందా లేదా అని సీఎం ప్రశ్నించారు. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామా లేదా అని కేసీఆర్ గుర్తుచేశారు.
ఏమాయనే నల్లగొండ అనే పాటను నేనే రాశానని సీఎం వివరించారు. 60 ఏళ్లు పాలించి తెలంగాణను ఆగమాగం చేశారని.. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్ నేతలు కారణం కాదా..? అని సీఎం ప్రశ్నించారు. మంచి చేసేవారిని గెలిపిస్తే మరింత ముందుకు వెళ్తామని.. వట్టి మాటలకు మోసపోవద్దని.. అన్నం పెట్టినవారిని ఆదరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గొర్రెలను వీళ్లు తిన్నారు తప్ప.. ఎవరైనా యాదవులకు గొర్రెలను ఇచ్చారా అని సీఎం ప్రశ్నించారు.