మీరా కుమార్ కు ముఖం చాటేసిన కెసిఆర్
వ్యూహ రచనలో తెలంగాణ సిఎం కెసిఆర్ ను మించిన వారు లేరు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు సరితూగే నాయకులే లేరు. ఆయన ఎత్తులకు విపక్షాలు చిత్తు కాక తప్పదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన అలా ఎందుకు చేస్తారో ఎవరికీ అంతు చిక్కదు. విపక్షాలకే కాదు సొంత పార్టీ నేతలకు కానీ, తుదకు తన కుటుంబసభ్యులకు కానీ అస్సలు సమజ్ కాదు. మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ విషయంలో కెసిఆర్ ఇలా ఎందుకు చేశారో ఎవరికీ అంతు చిక్కడంలేదు. ఫోన్ మాట్లాడితే పోయేదేముందని ప్నశ్నిస్తున్నారు జనాలు.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ అవసరమున్నా లేకపోయినా బిజిపితో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు అందరికంటే ముందుగా సిఎం మద్దుతు పలికారు. తన సూచన మేరకే మోడీ దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని ప్రకటించుకున్నారు కెసిఆర్.
ఇక ఉత్తుత్తగనే ఎందుకు అంత చొరవ తీసుకుని కెసిఆర్ కోవింద్ కు మద్దతిస్తున్నారని విపక్షాలు ఒకవైపు అనుమానాలు, విమర్శలు చేస్తున్నాయి. సిబిఐ కేసులకు భయపడే కెసిఆర్ ఎన్డీఎకు మద్దతిస్తున్నారని ఇప్పటికే టిడిపి, కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి. వాళ్లు అడగకపోయినా మద్దతిస్తున్నారు అందుకేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఒకవైపు జిఎస్టీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ లబోదిబోమంటున్నారు. తమకు తీరని నష్టం కలగబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై జిఎస్టీ దెబ్బ మామూలుగా ఉండదని ఆయన బెంబేలెత్తిపోయారు. కానీ కెసిఆర్ మాత్రం జిఎస్టీతో రాష్ట్రానికి పెద్దగా నష్టం ఏమీలేదని కవరింగ్ చేస్తున్నారు.
ఇక అన్నిటికి కంటే ముఖ్య విషయమేమంటే? తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోశించిన నాటి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ నేడు యుపిఎ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమెకు 17 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ టిఆర్ఎస్ మాత్రం ఆమెకు మద్దతు ఇవ్వలేదు. కనీసం ఆమె వంక కన్నెత్తి అయినా చూడలేదు టిఆర్ఎస్. ఆమె హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా సిఎం కెసిఆర్ కు ఫోన్ చేస్తే కెసిఆర్ ఆమె ఫోన్ కు అందుబాటులోకి రాలేదు. ఆ విషయాన్ని ఆమె ఆవేదనతో చెప్పారు. ఎలాగైనా కెసిఆర్ ను మద్దతు కోరతానని ఆమె అన్నారు. మద్దతు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు కానీ కనీసం ఫోన్ చేసినప్పుుడు మాటమాత్రంగా స్పందించినా బాగుండేది కాదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు కెసిఆర్ కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ హైదరాబాద్ నగరమంతటా ఫ్లెక్సీలు కట్టించారు. పింక్ కలర్ ఫ్లెక్సీలు భాగ్యనగర వీధుల్లో కొలువుదీరాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే కచ్చితంగా సిబిఐ భయంతోనే ఇలా చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణల్లో నిజాలు లేకపోలేదన్న రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.