కర్ణాటక నుండే బిఆర్ఎస్ అడుగులు... స్వయంగా రంగంలోకి కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
జాతీయ రాజకీయాలు చేయడానికి సిద్దమైన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పక్కనే వున్న కర్ణాటకలో జేడిఎస్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు.
గుల్బర్గా : తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలకు సిద్దమైన కేసీఆర్ ఆ దిశగా తొలిఅడుగు కర్ణాటక నుండి వేయనున్నారు. త్వరలోనే కర్ణాటకలో అసెంబ్లీ జరగననున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కు మద్దతిస్తున్న జేడిఎస్ (జనతా దళ్ సెక్యులర్) తరపున ప్రచారానికి కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ విషయాన్ని కర్ణాటక వేదికగానే మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడిఎస్ ప్రచారంలో పాల్గొంటారని మంత్రి సత్యవతి తెలిపారు.
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో జేడిఎస్ పార్టీ నిర్వహించిన సభలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుల్బర్గా జిల్లా జేడిఎస్ అధ్యక్షుడు శివ గుత్తేదార్ నేతృత్వంలో జరిగిన ఈ సభలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కర్ణాటక పాలిటిక్స్, బిఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
కర్ణాటకలోనే కాదు బిజెపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆయా రాష్ట్రాల్లో అభివృద్ది శూన్యమని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని... అందుకు కర్ణాటకలో అందిస్తున్న ఫిచన్లే ఉదాహరణగా పేర్కొన్నారు. పక్కనే వున్న తెలంగాణలో బిఆర్ఎస్ సర్కార్ రెండువేల ఫించన్ ఇస్తే కర్ణాటకలో మాత్రం కేవలం 600 రూపాయలు ఇస్తున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు.
Read More రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నాడు.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఇక ఇప్పటికే సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పాగా వేసేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితర ఏపీ నాయకులు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో కిషోర్ బాబుకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తానని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు.
ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ను బలోపేతం చేయాలన్నది కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రలో బిఆర్ఎస్ ను విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకంగా తమతో కలిసివచ్చే పార్టీలతో బిఆర్ఎస్ ముందుకు వెళుతుందని కేసీఆర్ స్పష్టం చేసారు. దేశంలో బిజెపి అసమర్థ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని... ఆ దిశగానే బిఆర్ఎస్ రాజకీయాలు వుంటాయని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.