బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్‌ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు.

బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని.. కేడర్‌తో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు. 

అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్‌ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలను ఇన్‌ఛార్జీలుగా నియమిస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్న ఆయన.. గత ఎన్నికల్లో కంటే ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బందని, తాను చేసేదేం లేదని కేసీఆర్ హెచ్చరించారు. 

ALso Read: బాగా పనిచేసే వాళ్లకే టికెట్లు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కేసీఆర్!

గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 250కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.