అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్... మొక్కజొన్నల కొనుగోలుకు నిర్ణయం
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
![Telangana CM KCR Good News to Farmers Maize farmers AKP Telangana CM KCR Good News to Farmers Maize farmers AKP](https://static-ai.asianetnews.com/images/01g9w1sz1jh5d54gn05sp5pynm/monsoon-food-maize-should-be-included-in-monsoon-food_363x203xt.jpg)
హైదరాబాద్ : ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన అకాల వర్షాలతో తీవ్ర నష్టాలపాలైన అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ అండగా నిలిచింది. వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగిలో పండిన మొక్కజొన్నను రైతుల వద్ద తక్షణమే కొనుగోలు చేయాలని... వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ మంత్రి తెలిపారు. ఈ యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని... 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తం మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read More Heavy Rains : రైతన్నలారా జాగ్రత్త.. మరో ఐదురోజులు భారీ వర్షాలు..
ప్రభుత్వ నిర్ణయంపై మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల రైతులకు ప్రధానంగా మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అయితే ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరికి భరోసానిస్తూ క్వింటాలుకు మద్దతు ధర రూ.1962 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది.
ఇదిలావుంటే ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ఎక్కువమంది వరి, మొక్కజొన్న రైతులే. అయితే ఇప్పటికే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు రైతుల అండగా వుండేందుకు మొక్కజొన్న కొనుగోలుకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇటీవల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయం నుండి వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ ప్రాథమిక అంచనా తెలుపుతుంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టమైందని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది. వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది.
ఆయా జిల్లాల్లో పంట నష్టంపై ప్రజా ప్రతినిధులు, మంత్రులు కూడా ఆరా తీస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రజాప్రతినిధులు ఓదార్చారు. మరో వైపు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.