Heavy Rains : తెలంగాణలో మరో ఐదురోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains : తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే.. ఉపశమనం కలిగించేలా వానలు కురుస్తున్నాయి. కానీ.. ఈ అకాల వర్షాలు రైతన్నలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వానాలు బీభత్సం స్రుష్టించాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. వర్షార్పణం కావడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే.. మరోవైపు అకాల వర్షాలు అతాలాకుతలం చేయబోతున్నాయనీ, రాష్ట్రంలో మరో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రైతన్నలు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు, వడగడ్ల వానాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి ప్రభావం కారణంగా ఏర్పడిన క్యూములోనింబస్ వలన భారీ వర్షాలు పడతాయని, గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల సాధారణంగా వర్షాకాలంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
గత రెండు క్రితం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో భారీ మొత్తంలో పంట నష్టం జరిగింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం,మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పండ్ల తోటలు, వరి, మొక్కజొన్న పంటలను తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రోడ్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
