గిరిజనులకు పట్టాలిచ్చినా.. పోడు భూములపై అధికారం అటవీ శాఖదే : కేసీఆర్
గిరిజనులకు పోడుభూములపై పట్టాలు ఇచ్చినా.. ఈ భూమి మరో వందేళ్లు గడిచినా అటవీ శాఖ యాజమాన్యం కిందే వుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో పోడు భూములపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పోడు భూములకు సంబంధించిన చట్టాన్ని తెచ్చి కాంగ్రెస్ పార్టీయేనన్నారు. గిరిజనులు కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తుంటేనే వారికి పట్టాలు ఇస్తారని కేసీఆర్ తెలిపారు. అందులోనూ అడవిలో పండే పంటలనే పండించాల్సి వుంటుందన్నారు. ఇవి ధరణి పోర్టల్ పరిధిలోకి రావని, ఈ భూమి మరో వందేళ్లు గడిచినా అటవీ శాఖ యాజమాన్యం కిందే వుంటుందని కేసీఆర్ వెల్లడించారు.
సుప్రీంకోర్ట్ తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కీలక విషయాలను పొందు పరిచిందని సీఎం అన్నారు. ఆ భూమి సాగు చేసుకోవడానికి , గిరిజనులు జీవనం సాగించేందుకే ఆ పాస్బుక్ ఇస్తామని కేసీఆర్ తెలిపారు. గతంలో పాస్బుక్ వుంటే కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం వెల్లడించారు. గిరిజనులకు కరెంట్ సరఫరాతో పాటు సాధారణ రైతులతో సమానంగా రైతుబంధు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
దీనిపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బడుగు , బలహీన వర్గాలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకుని వాటిని కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతోందని భట్టి ఆరోపించారు. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు.