కృష్ణంరాజు మరణం తెలుగు సినీపరిశ్రమకే తీరని లోటు..: సీఎం కేసీఆర్
ప్రముఖ తెలుగు సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ఱంరాజు అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ : అలనాటి తెలుగు సినీనటుడు , మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపిన సీఎం బాధలో వున్న ఆయన కుటుంబాపికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని సీఎం కేసీఆర్ అన్నారు. యాభై ఏళ్ల సినీ జీవితమంతా హీరోగానే కాదు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రేదయినా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారని... ఇలాంటి విలక్షణ నటనతో కృష్ణంరాజు రెబల్ స్టార్ గా మారారని కేసీఆర్ అన్నారు. ఇలా టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ఱంరాజు రాజకీల్లోనూ తన ముద్ర వేసారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా గెలిచి తెలుగు రాష్ట్రం నుండి కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం ఆయనకు లభించిందన్నారు. ఇలా రాజకీయాల్లో చేరిన కృష్ఱంరాజు ప్రజాసేవ కూడా చేసారని సీఎం కేసీఆర్ గుర్తుచేసారు.
read more కృష్ణం రాజు ఆస్తుల వివరాలు.. మొగల్తూరులోనే అంత ఉందా, దిమ్మతిరిగిపోద్ది..
ఇక కృష్ణంరాజు మృతిపై కేసీఆర్ తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా విచారం వ్యక్తం చేసారు. తెలుగు సినిమాలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాలమరణం బాధాకరమన్నారు. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపుతూ బాధలో వున్న ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబానికి, స్నేహితులకు కేటీఆర్ సానుభూతి ప్రకటించారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కూడా కృష్ణంరాజు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణ వార్త విని షాక్ కు గురయ్యాననని సంతోష్ తెలిపారు. పెదనాన్నను కోల్పోయిన హీరో ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబం ఎంత బాధలో వుందో ఊహించగలనని... వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఇంతకాలం తమను అలరించిన కృష్ఱంరాజు ఇక లేరన్న విషాదకర వార్త తెలుగు సినీ ప్రియులు ఎంత బాధిస్తుందో తెలుసని... వారి మనోవేధనను అర్థం చేసుకోగలనని అన్నారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పేర్కొన్నారు.
83 ఏళ్ల వయసులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ రోజు(ఆదివారం) మృతిచెందారు. హైదరాబాద్ లోని నివాసంలో తెల్లవారుజామున 3.25 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఆయన మృతితో భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు హీరో ప్రభాస్ కుటుంబం కూడా తీవ్ర బాధలో వున్నారు. తమ అభిమాన నటుడి మృతి తెలుగు సినీప్రియులను బాధిస్తోంది. రేపు (సోమవారం) ఉదయం హైదరాబాద్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లేదా జే ఆర్ సీ కన్వెన్షన్ లో ఉంచే అవకాశాలున్నాయి.