తెలంగాణ నుండి పోటీ చేయాలి: సోనియాను కోరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ నుండి పోటీ చేయాలని తెలంగాణ నేతలు సోనియా గాంధీని కోరారు.
![Telangana Chief Minister Anumula Revanth Reddy Meets Sonia Gandhi lns Telangana Chief Minister Anumula Revanth Reddy Meets Sonia Gandhi lns](https://static-ai.asianetnews.com/images/01hkhed0qacwvcp5exjwk1hv11/revanth-reddy-jpeg_363x203xt.jpg)
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సోమవారంనాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి
బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందజేత, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
also read:మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియాగాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.