Asianet News TeluguAsianet News Telugu

ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: ప్రతి ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేలా ఆదేశాలు

ఇచ్చిన వాగ్ధానం మేరకు  అనుముల రేవంత్ రెడ్డి  ఇవాళ ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ ను ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు  ప్రజా దర్బార్ ను  సీఎం స్టార్ట్ చేశారు.

 Telangana Chief Minister Anumula Revanth Reddy begins Praja Darbar at praja bhavan lns
Author
First Published Dec 8, 2023, 11:29 AM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టిన తర్వాత   ప్రజాదర్భార్ ను  శుక్రవారంనాడు ప్రారంభించారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  ప్రజా భవన్‌లో ప్రజా దర్భార్ ను నిర్వహిస్తామని  రేవంత్ రెడ్డి  ప్రకటించారు.  ఇవాళ  ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే  ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమానికి  పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకే  ప్రజలు వినతి పత్రాలతో వచ్చారు.   ఇళ్లు, భూమి సమస్యలు, ఉద్యోగ సమస్యల వంటి వాటిపై  సీఎంకు  వినతిపత్రం సమర్పించేందుకు  ప్రజా భవన్ కు  వచ్చారు.

ఇవాళ ఉదయం 10 గంటలకు  ప్రజా భవన్ కు వచ్చిన ప్రజల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు వినతి పత్రాలు స్వీకరించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం  ఉన్న సమయంలో  ప్రజల సమస్యలపై  వినతి పత్రాలు   తీసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  ప్రతి రోజూ క్యాంప్ కార్యాలయంలో  ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించేవారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తర్వాత  వచ్చిన  ముఖ్యమంత్రులు కూడ  ప్రజల సమస్యలను  వినేవారు. ప్రజలతో మాట్లాడి వారి  సమస్యల పరిష్కారం కోసం అప్పటి కప్పుడు  అధికారులకు ఆదేశాలు  జారీ చేసేవారు.  

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.తెలంగాణ రాష్ట్రంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2018 ఎన్నికల్లో  రెండు దఫాలు  తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  సీఎంగా  పనిచేశారు. కేసీఆర్ సీఎంగా  ఉన్నప్పుడు  సామాన్య జనం  ప్రగతి భవన్ కు  వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ప్రగతి భవన్  వద్ద బారికేడ్లను కూడ ఏర్పాటు చేశారు.  ప్రగతి భవన్ వద్ద ఆందోళనలు నిర్వహించకుండా బారికేడ్లతో పాటు బారీ బందోబస్తు ఉండేది.  

రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రగతి భవన్  వద్ద ఉన్న బారికేడ్లను  తొలగించారు. బారికేడ్లను తొలగించాలని  ఆదేశాలు జారీ చేసినట్టుగా  సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.  అంతేదకాదు ప్రగతి భవన్ పేరును  జ్యోతిరావుపూలే ప్రజాభవన్ గా మారుస్తున్నట్టుగా  అంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రికి నేరుగా తమ బాధలు, కష్టాలు చెప్పుకొనే అవకాశం తెలంగాణలో పదేళ్ల తర్వాత వచ్చిందని  ప్రజా దర్బార్ కు వచ్చిన  బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి  అప్పటికప్పుడు  అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

ప్రజా దర్బార్ లో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారం కోసం  20 మంది సిబ్బందిని నియమించారు.  ఈ ఫిర్యాదులపై సమీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించనున్నారు.ఆయా ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లు,  సంబంధిత శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు చేస్తున్నారు.ఇవాళ  సీఎం  కేసీఆర్ ను కొండపోచమ్మ  ముంపు  బాధితులు  కలిశారు. తమకు  పరిహారం ఇవ్వాలని కోరారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios