వచ్చే మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీతో జలవివాదంతో పాటు కరోనా థర్డ్‌వేవ్, థియేటర్ల పున: ప్రారంభంపై చర్చించనుంది మంత్రి మండలి. 

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ వేదికగా క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ఏపీతో జలవివాదాలు, కరోనా పరిస్థితులు, ఆంక్షల సడలింపులు, థర్డ్ వేవ్ అంచనాలు వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఏపీతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలాగే కరోనా వల్ల మూతపడిన సినిమా థియేటర్ల పునఃప్రారంభం, ఇతర సామాజిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే విషయాన్ని కూడా కేబినెట్‌‌లో చర్చించనున్నారు. కరోనా థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల వ్యాప్తి తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read:ఏ వేవ్ , ఏ వేరియంట్ ఎప్పుడు వస్తుందో.. కరోనా వ్యాప్తిపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అంతేగాకుండా, వర్షాకాలం ప్రారంభం కావడంతో, వ్యవసాయరంగంపైనా చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందించడం, కల్తీ రహిత ఎరువులు, విత్తనాలు రైతులకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు సూచనలు చేయనున్నారు. వీటితో పాటే పల్లెప్రగతి, పట్టణాభివృద్ధి అంశాలను కూడా కేబినెట్ భేటీ అజెండాలో చేర్చినట్లుగా తెలుస్తోంది