జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్ల వ్యవహారంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మీటర్లు వున్నా ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారని ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్ల విషయంలో టీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతమన్నారు. మోటార్లకు మీటర్లు వుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. మీటర్లు వున్నా ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడా అధికారికంగా చెప్పలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే... మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల ఆధారంగా నిన్న విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశాన్ని పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో పోల్చుతూ వివరించిన సంగతి తెలిసిందే. సృజనాత్మక కథనాలతో పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు పాన్ ఇండియా హిట్గా నిలుస్తున్నాయని, అలాంటప్పుడు బోల్డ్ విజన్, గంభీరమైన ఆలోచనలతో దేశ అభివృద్ధిని, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో తప్పేముందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లాంటి పోరాటకారుడిని ఎవరూ అడ్డుకోలేరని, దక్షిణాది నుంచైనా ఎదిగి జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఓడించే సత్తా ఆయనకు ఉన్నదని తెలిపారు.
ALso REad:ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు?.. లెక్కలు తెలుసుకోండి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు కేటీఆర్ కౌంటర్
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. పాన్ ఇండియా స్టార్గా కేసీఆర్ నిలుస్తారనే కేటీఆర్ మాటకు కౌంటర్గా.. అవినీతిలో అన్ని రికార్డులు బద్ధలు కొట్టే పాన్ ఇండియా స్టార్గా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ వంశం ఎలా కొల్లగొట్టిందో... ఒక అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో భారత ప్రజలందరూ తెలుసుకోనివ్వండి అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ రహస్య గతం, సంశయాత్మక ఆయన రాజకీయ ప్రయాణంపై తీసే సినిమా తప్పకుండా పాన్ ఇండియా హిట్ అవుతుందని తెలిపారు. తన ట్వీట్కు కేటీఆర్ చేసిన కామెంట్లకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ను జోడించారు.