తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. 

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నను వీరపట్నంగా మారుద్దామా , వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు. పాతబస్తీలో పాకిస్తాన్ జెండాలు పట్టిన చేతులతో ఇప్పుడు జాతీయ జెండాను పట్టించామన్నారు. మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీ గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను తరతరాలకు అందించే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదని బండి సంజయ్ మండిపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోడుభూముల పేరుతో గర్భవతులను కూడా ఈడ్చికెళ్లి లాఠీఛార్జీ చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీలను కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. 317 జీవోతో ఉద్యోగస్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒవైసీపీకి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఐఎస్ఐ ఉగ్రవాదులు, బాంబులు పేల్చేటోళ్లు కనిపిస్తారు తప్పించి బీజేపీ కార్యకర్తలు కనిపించరని బండి సంజయ్ దుయ్యబట్టారు. రావణ రాజ్యం కావాలా.. రామ రాజ్యం కావాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన ప్రశ్నించారు. 

Also Read:భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు PFI కుట్ర..: బండి సంజయ్

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతానని కేసీఆర్‌కు తెలిసిపోయిందని సంజయ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మంచి పథకాలను తాము వస్తే అడ్డుకోబోమని.. ఇంకా వాటిని విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల డబ్బు ఇస్తానని కేసీఆర్ ఆశపెట్టారని .. కానీ ఆయన మాత్రం బీజేపీపై విశ్వాసంతోనే తమ పార్టీలో చేరారని బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడులో గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే అక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తానని బండి సంజయ్ తెలిపారు.