తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం... మరి ఇప్పటికే వెలువడ్డ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..
తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో ఈ ఎన్నికలు ముగిసేవరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదలను ఈసీ నిషేధించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఎగ్జిట్ పోల్ నిషేధం కొనసాగనుంది.
ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ వెలువడి ఎలక్షన్ కోడ్ అమల్లో వుంది. నవంబర్ 7 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభంకానుంది. చివరిదశ పోలింగ్ నవంబర్ 30న ముగియనుంది. ఈ పోలింగ్ సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, మీడియాలో ప్రసారం చేయడం, ప్రచురించడం నిషేధమని ఎన్నికల కమీషన్ తెలిపింది.
నిబంధనలను ఉల్లంఘించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా... ప్రచారం చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసి హెచ్చరించింది. నిషేధిత సమయంలో ఎగ్జట్ పోల్స్ నిర్వహించి ప్రచారం చేసినవారికి రెండేళ్ళ వరకు జైలుశిక్ష లేదంటే జరిమానా విధించే అవకాశాలు వుంటాయని తెలిపింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ పేరిట ఓటర్లను ప్రభావితం చేయవద్దని ఎన్నికల కమీషన్ సూచించింది.
Read More తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు .. హైదరాబాద్కు రానున్న ఈసీ బృందం , ఏర్పాట్లపై సమీక్ష
అయితే ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా వుంది... ఏ పార్టీ అధికారంలోకి వస్తాయో ప్రకటించారు. ప్రీ పోల్స్ సర్వేల ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు వుండనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని... మరికొన్ని ఈసారి కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కడతారని ప్రకటించారు. అయితే ఏ పార్టీకి బంఫర్ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది.
రెండుసార్లు అధికారంలో వుండి అంటే పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకత వుందని ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు బిఆర్ఎస్ ను ఢీకొట్టేంత బలంగా లేకపోవడంతో ఈసారి ఓట్లు, సీట్లు తగ్గినా హ్యాట్రిక్ విజయం సాధించ నుందని పోల్స్ అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో పాటు రైతు బంధు, ఆసరా ఫించన్లు వంటి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కు ప్లస్ కానున్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.