తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 13 ఏళ్ల చిన్న వయసులోనే మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. వీరి కుటుంబానికి వందల ఎకరాల భూమి వుంది. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును మల్లు స్వరాజ్యం గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టాయి. సాయుధ పోరాటంలో భాగంగా అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఆమె పని చేశారు. నాడు దొరల దురహంకారంపై పాటల ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు.
మహిళ కమాండర్ గా పని చేస్తున్న మల్లు స్వరాజ్యంను పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని అప్పటి నైజాం పాలకులు ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారామె. వీరి భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు.
మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకు ఒక కుమార్తె. ఆమె పేరు పాదూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు . చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు . వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా.. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు.
