కొత్త తరహా నిరసన: డీఎస్సీ వేయలేదని కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం
నిరసన చేయడమంటే నినదించడమే కాదు... ఆందోళన చేయడమంటే ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు... ఇలా కూడా చేయోచ్చు... సర్కారుకు కనువిప్పు కలిగించవచ్చు.
రాష్ట్రంలో తాగడానికి పాల దొరక్కపోవచ్చు... ప్రజాప్రతినిధుల ఫొటోలకు అభిషేకాలు చేయడానికి మాత్రం లీటర్లకొద్దీ పాలు దొరుకుతున్నాయి.
మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేతనాలు పెంచగానే ఉద్యోగస్తులందరూ పాలసెంటర్ల వెంబడి క్యూలు కడుతున్నారు. కేసీఆర్ చిత్రపటానికి లీటర్ల కొద్ది పాలతో అభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
పాపం... నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం నోటిఫికేషన్లు రాక... ఉద్యోగాలు లేక కన్నీరు కారుస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేసీఆర్ సర్కారు మాత్రం స్పందించడం లేదు.
ఇక లాభం లేదనుకున్నారేమో కానీ, నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మొదలెడుతున్నారు. నోటిఫికేషన్లు వేయలేదు, ఉద్యోగాలు రాలేదు. మరెందుకు ఈ పాలాభిషేకాలు అనే డౌట్ రావొచ్చు.
ఇదే ప్రశ్న వాళ్లను అడిగితే ఏ మన్నారో తెలుసా...
పాలాభిషేకాలు అభిమానంతోనే చేయాలా... ఆందోళనతో చేయకూడదా...ఇదో కొత్త తరహా నిరసన.. మేం ఇలాగే చేస్తాం... సర్కారుకు కనువిప్పుకలిగిస్తాం అంటున్నారు జోగులాంబ జిల్లా గట్టు మండలానికి చెందిని డీఎస్సీ అభ్యర్థులు.
మూడేళ్లు గడుస్తున్నా రేపు మాపు డీఎస్సీ అంటూ ప్రకటనలు ఇవ్వడం తప్పతే సర్కారు చేసిందేమీ లేదు. అందుకే కడపుమండిన ఆగ్రహంతో ఈ కొత్త తరహా నిరసనకు దిగినట్లు వారు చెబుతున్నారు. డీఎస్సీని వెంటనే ప్రకటించాలని నల్లబ్యాడ్జిలు ధరించి కేసీఆర్ చిత్రపటం ముందే ఆందోళన కూడా చేస్తున్నామన్నారు.
ఈ కొత్త తరహా ఆందోళన కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ సాధన సమితి సభ్యులు రాజుసాగర్,ఉరుకుందు, అమరేష్, భాస్కర్, తిప్పన్న, మౌళాలి, వీరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.