గతంలో టీడీపీ కూడా బీసీ కార్డు పేరుతోనే కృష్ణయ్యను పార్టీలోకి లాగింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో అడుగుపెడుతూనే ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.

ఆపరేషన్ ఆకర్షలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యను పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో బీసీ సంఘం నేతగా కృష్ణయ్యకు మంచి గుర్తింపు ఉంది. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన వెంట లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.

అందుకే ఆయనకు కాషాయ కండువ కప్పడానికి బీజేపీ పెద్దలుగా బాగానే ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి నిన్న టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో గంటపాటు చర్చలు జరిపారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో టీడీపీ కూడా బీసీ కార్డు పేరుతోనే కృష్ణయ్యను పార్టీలోకి లాగింది. ముఖ్యంగా తెలంగాణలో 34 శాతంపైగా బీసీ లే ఉండటంతో ఆయననే తెలంగాణలో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

ఇప్పుడు అదే దారిలో బీజేపీ నడుస్తోంది. తెలంగాణలో బీసీలను ఆకర్షించాలంటే కృష్ణయ్యే ఆయుధమని గ్రహించడంతోనే కమలనాథులు ఈ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

అసలే తెలంగాణలో పార్టీ పడకేసింది. ఇప్పుడు కృష్ణయ్య కూడా జంప్ అయితే తెలంగాణలో పార్టీకి ఉన్న బీసీ ఇమేజ్ కూడా పూర్తిగా పోయినట్లే అవుతుందని ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇప్పటి వరకు బీజేపీలో చేరే విషయంపై కృష్ణయ్య నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

బీజేపీలోకి రావాలన్న ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని కృష్ణయ్య సమాధానం చెప్పినట్టు సమాచారం.