ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌కు రావడం వెనుక చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం నేపథ్యంలో నాటి జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (indian school of business) 20వ వార్షికోత్సవంలో (isb 20th anniversary) పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నిజానికి ఆనాడు తీవ్ర పోటీ మధ్య ఐఎస్‌బీని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే. నాటి మ‌ధుర స్మృతుల‌ను గుర్తుచేసుకుంటూ చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస‌గా 17 ట్వీట్లు పోస్ట్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐఎస్‌బీని హైద‌రాబాద్‌కు రప్పించే క్ర‌మంలో తాను ఏమేం చేశాన‌న్న విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. గ‌చ్చిబౌలిని ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్‌గా (financial district) మార్చే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న స‌మయంలోనే త‌న మ‌దిలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఓ బిజినెస్ స్కూల్ అక్క‌డ ఏర్పాటైతే గ‌చ్చిబౌలి రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని భావించిన‌ట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే దేశంలోని పారిశ్రామిక దిగ్గ‌జాలంతా క‌లిసి ఓ అత్యున్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేయాల‌నుకుంటున్నార‌ని ఆయన తెలిపారు. అందులో భాగంగా దాని పేరును ఐఎస్‌బీగా పెట్టార‌ని, దానికి డైరెక్ట‌ర్ల బోర్డు కూడా ఏర్పాటైపోయింద‌న్న విష‌యం తెలిసింద‌ని చంద్ర‌బాబు వెల్లడించారు. 

అప్ప‌టికే అభివృద్ధి ప‌రంగా హైద‌రాబాద్ కంటే ముందున్న ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా న‌గ‌రాల్లోని ఒక దానిలో ఐఎస్‌బీ పెట్టాల‌న్న విష‌యంపై పారిశ్రామిక దిగ్గ‌జాలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. ఈ సమయంలో వారి ముందు హైద‌రాబాద్ ప్ర‌తిపాద‌న వ‌చ్చేలా చేశాన‌ని పేర్కొన్నారు. ఇందుకోసం తాను సీఎంని అన్న విష‌యాన్ని మ‌రిచి పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో క‌లిసిపోయాన‌ని, వారికి తానే స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించాన‌ని చంద్రబాబు వివ‌రించారు. 

ఈ క్ర‌మంలో ముంబై, బెంగ‌ళూరు కంటే హైద‌రాబాద్ ఎందుకు బెట‌ర్ అన్న విష‌యాన్ని వారికి వివ‌రించి...చివ‌ర‌కు వారిని ఒప్పించాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ య‌త్నాల‌న్నీ ఫ‌లించి ఐఎస్‌బీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2001 డిసెంబ‌ర్ 2న నాటి ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి (atal bihari vajpayee) ఐఎస్‌బీని ప్రారంభించార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. అలాగే ఐఎస్‌బీ రాక‌ముందు గ‌చ్చిబౌలి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అన్న ఫొటోల‌తో పాటు ఐఎస్‌బీ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన‌ వాజ్‌పేయితో ఉన్న ఫొటోల‌ను కూడా చంద్ర‌బాబు షేర్ చేశారు. 

Scroll to load tweet…