భర్త భూకబ్జాలు.. నిలదీస్తే చెప్పుతో కొడతా: జనానికి వార్నింగ్ ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు . స్వప్న వ్యాఖ్యలతో అక్కడేవున్న కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే, తాడికొండ స్వప్న... ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏదోలా బయటపడ్డారు. ఈ క్రమంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మున్సిపాలిటీలో చేపట్టిన “గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం జరిగింది.
“గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం ముగింపు వేళ.. 13వ వార్డు పర్యటనకు వెళ్లారు నేతలు. కాలనీకి చెందిన కొందరు పేదలు తాము రూపాయి రూపాయి పోగుచేసి కొనుక్కున్న ఇళ్ల స్థలాలను కొందరు వ్యక్తులతో కలిసి పరిమల్ గుప్తా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆటైమ్లో అక్కడే ఉన్నారు గుప్తా భార్య, మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న ఆగ్రహంతో ఊగిపోయారు. తన భర్త పేరుతో ఫిర్యాదు చేస్తారా.. అంటూ సహనం కోల్పోయి.. చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. స్వప్న వ్యాఖ్యలతో అక్కడేవున్న కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.