తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  సోమవారం నాడు  మధ్యాహ్నం ఈడీ విచారణకు హాజరయ్యారు. 


హైదరాబాద్: ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం నాడు మధ్యాహ్నం హాజరయ్యారు. బ్యాంకు స్టేట్ మెంట్ తో రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ నెల 16వ తేదీన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కుటుంబ సభ్యుల వివరాలు, వ్యాపారాలు, ఆస్తులు, బ్యాంకు స్టేట్ మెంట్ల వివరాలతో విచారణకు రావాలని ఈడీ అధికారులు పైలెట్ రోహిత్ రెడ్డిని ఆదేశించారు.అయితే ఈ నోటీసులో కేసు అంశాన్ని ప్రస్తావించలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 31వ తేదీ వరకు తనకు సమయం కావాలని పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి లేఖను పంపారు. కానీ ఈడీ అధికారులు పైలెట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చేందుకు తిరస్కరించారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు పైలెట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

ఈ నోటీసు విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తో పైలెట్ రోహిత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన భేటీ అయ్యారు. ఈడీ నోటీసులపై ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఇవాళ ఉదయం కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని పీఏ ద్వారా లేఖను పంపి సీఎంతో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. విచారణకు ఇవాళ కచ్చితంగా హాజరు కావాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

also read:డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని రుజువు చేస్తే రాజీనామా: బీజేపీ నేతలకు పైలెట్ రోహిత్ రెడ్డి కౌంటర్

బెంగుళూరు డ్రగ్స్ కేసు, హైద్రాబాద్ డ్రగ్స్ కేసులను రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల కాలంలో పదే పదే ప్రకటించారు.బెంగుళూరులో జరిగిన ఓ పార్టీలో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది.బెంగుళూరు డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని పైలెల్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కేసు విషయమై తనను కర్ణాటక పోలీసులు ఏనాడు పిలవలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోహిత్ రెడ్డి విమర్శలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.ఈ సవాల్ ను బండి సంజయ్ స్వీకరించకపోవడంతో తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు.నిన్న కూడా భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రోహిత్ రెడ్డి వచ్చారు. తన సవాల్ ను బండి సంజయ్ ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు.బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రోహిత్ రెడ్డి విమర్శలు చేశారు.