సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ .. ధనవంతులకే మేలు, సామాన్యులకు లాభమేంటీ : పొన్నాల
సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. స్వయంగా ప్రధాని మోడీ, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసైలు ఒక రైలు గురించి ఎందుకంత ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా వుందన్నారు. పండగపూట రాజకీయాలు వద్దు అనుకున్నానని, కానీ మాట్లాడాల్సి వచ్చిందని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా ప్రధాని మోడీ, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసైలు ఒక రైలు గురించి ఎందుకంత ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ , విశాఖపట్నం మధ్య ఇప్పటికే 17 రైళ్లు వున్నాయని.. వందే భారత్ ఎక్స్ప్రెస్ 18వదన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు,ప్రచారాలు , ప్రారంభోత్సవాలు చేస్తున్నారని పొన్నాల దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను గత ఎనిమిదేళ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.
ALso REad: సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు: ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇకపోతే.. సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయన ఈ రైలును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ పండుగ కానుక అని అన్నారు. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి అవకాశం దక్కనుందని మోడీ అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతో ఎంతో ప్రయోజనం దక్కనుందని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ - విశాఖపట్టణం మధ్య ఈ రైలుతో ప్రయాణ సమయం కూడా తగ్గనుందని మోడీ తెలిపారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో అనేక ప్రయోజనాలున్నాయని మోడీ చెప్పారు.
ఇవాళ మాత్రం ప్రత్యేక వేళల్లో మాత్రమే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది. రేపటి నుండి వందేభారత్ రైలు రెగ్యులర్ గా సర్వీసులను నిర్వహించనుంది.విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 05:45 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 02:15 గంటలకు రైలు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి రైలు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలులో 14 ఏసీ కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణీకులను ఈ రైలు తమ గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైలులో రెండు ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కారు కోచ్ లున్నాయి.