తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రపంచ శ్రేణి వారధిని కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జీని కృష్ణా నదిపై నిర్మించబోతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రపంచ శ్రేణి వారధి నిర్మించతలపెట్టినట్టు వెల్లడించారు. ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జీని కృష్ణా నదిపై రూ. .1,082.56 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ బ్రిడ్జీని 30 నెలల్లో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఈ ట్వీట్‌కు ప్రగతి కా హైవే అని ట్యాగ్ చేశారు. 

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాల మధ్య దీన్ని నిర్మించనున్నారు. సోమశిల వద్ద ఈ బ్రిడ్జీ నిర్మిస్తారు. ప్రపంచంలో ఇలాంటి బ్రిడ్జీ కేవలం ఒక్కటే ఉన్నదని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేస్తే ప్రపంచంలో రెండోదే కాదు.. దేశంలో మొదటి బ్రిడ్జీ ఇదే అవుతుందని వివరించారు.

Scroll to load tweet…

ఈ బ్రిడ్జీ నిర్మించడం వల్ల తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి సుమారు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. ఈ బ్రిడ్జీకి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఏపీ వైపు సంగమేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయని గడ్కరీ తెలిపారు.

వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో రమణీయమైన ప్రకృతి ఉంటుందని వివరించారు. ఈ వంతెన పై పాదచారులు నడిచే ఏర్పాటు కూడా చేస్తామని తెలిపారు. గ్లాస్ వాక్ వేను నిర్మిస్తామని పేర్కొన్నారు.

Also Read: 2024 నాటికి యూపీ రోడ్లను అమెరికాతో స‌మానంగా తీర్చిదిద్దుతాం - సీఎం యోగికి నితిన్ గడ్కరీ హామీ

తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటే పడవలో ప్రయాణించడమే మార్గంగా ఉన్నది. రోడ్డు అదే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు దూరం ఉన్నది.