న్యాయం స్థానం అంటేనే నిజం, నిజాయితీ. కోర్టు బోనులో నిల్చున్న వ్యక్తిని కూడా అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేయిస్తారు. అయితే ఓ జస్టిస్ మాత్రం దీనికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
“కోర్టులో మీరు ఇంతగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు.” – ఇది సుప్రీం కోర్టు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ వాక్యం. ప్రస్తుతం ఇది న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యాఖ్య ఎందుకొచ్చింది? అసలు ఏం జరిగింది?
ఒక ముఖ్యమైన కేసు విచారణ జరుగుతుండగా, ఆ కేసును వాదిస్తున్న లాయర్ అప్పట్లో హైకోర్టులో ఉన్న కారణంగా సుప్రీం కోర్టుకు రాలేకపోయారు. ఆయన బదులుగా ఒక జూనియర్ లాయర్ సుప్రీంకోర్టుకు వచ్చారు. కేసు పిలిచినప్పుడు జూనియర్ లాయర్ వచ్చి.. “మా సీనియర్ లాయర్ హైకోర్టులో బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు” అని చెప్పారు.
ఈ మాటలు విన్న జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ స్పందిస్తూ... “ఇంతగా నిజాయితీ అవసరం లేదు. భవిష్యత్తులో దీన్ని గుర్తుపెట్టుకోండి. మీ సీనియర్ హైకోర్టులో బిజీగా ఉన్నారని చెప్పకూడదు. మేము (జడ్జులు) కొంచెం ఈగోతో ఉంటాం. ఇలాంటి నిజాయితీ అక్కర్లేదు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు.” అని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రం నాథ్ కూడా జూనియర్ లాయర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఇలాంటి విషయాలు మీ సీనియర్ లాయర్ ముందే నేర్పాల్సింది.” అని అన్నారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
సుప్రీం కోర్టులో జడ్జి స్వయంగా “చిన్న అబద్ధాలు చెప్పొచ్చు” అని చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. న్యాయస్థానంలో అబద్ధం చెప్పడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. అయితే జస్టిస్ చేసిన ఆ వ్యాఖ్యలు సీరియస్ నోట్ కాదని, హాస్యంతో కూడిన వ్యాఖ్యలు అంటూ కొందరు న్యాయమూర్తులు సమర్థించే ప్రయత్నం చేశారు.