సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. ఖమ్మం సమీపంలో ఘటన..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. శుక్రవారం సికింద్రాబాద్లో బయలుదేరిన వందే భారత్ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చైర్ కార్ కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసం అయింది. దీంతో రైలు విశాఖపట్నం చేరుకన్న తర్వాత గ్లాస్ను మార్చారు.
అయితే వందేభారత్ ఎక్స్ప్రెస్కు విండో గ్లాస్ మార్చాల్సి రావడంతో.. శనివారం ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు 3 గంటలు ఆలస్యంగా 8:52 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరింది. దాడికి పాల్పడిన నిందితులని ట్రైన్ రెక్కు ఉన్న సీసీ కెమెరా ద్వారా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
ఇక, సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్పై గతంలో కూడా రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రారంభానికి ముందే విశాఖ కంచరపాలెంలో వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్లో భాగంగా చెన్నై నుంచి రైలు విశాఖ వస్తుండగా రాళ్ల దాడి జరిగింది.