శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. పాతబస్తీలోని సీతారాంబాగ్ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభించింది.
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. పాతబస్తీలోని సీతారాంబాగ్ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభించింది. శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. భోయిగూడ కమాన్, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్పేట్ పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమేరత్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి కూడలి, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. ఆకాశ్పురి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర కొనసాగుతుంది.
శ్రీరామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రను పర్యవేక్షించేందుకు నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేస్తారు.
ఇక, నిర్ణీత మార్గంలో ఊరేగింపు వెళ్లినప్పుడు ఈ మార్గంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
