తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా ఆయన కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా ఆయన కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించారు. అందులో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. తోట చంద్రశేఖర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. పార్టీలో చేరిన రావెల కిషోర్, పార్థసారథి, ఇతర నేతలకు కూడా కేసీఆర్ పలు బాధ్యతలు అప్పజెప్పారు.
అయితే ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా అక్కడ తమకు అనుకూల మీడియా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్కు అనుకూలంగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే. కేసీఆర్ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్.. ఉద్యమ సమయంలో కూడా కీలక భూమిక పోషించారు. వీటికి అనుబంధంగా తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ దినపత్రిక కూడా ఉంది.
ఇప్పుడు ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక న్యూస్ పేపర్ను తీసుకురావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నమస్తే తెలంగాణ యాజమాన్యంలోనే.. ‘‘నమస్తే ఆంధ్రప్రదేశ్’’ పేరుతో పత్రికను తీసుకురానున్నారని ప్రచారం జరుగుతుంది. తద్వారా ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలతో, పార్టీ నాయకుల కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ద్వారా ప్రజల్లో ఆదరణ సంపాదించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
