సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ రైలులో పొగలు: బీబీనగర్లో నిలిపివేత
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ రైలులో ఆదివారంనాడు పొగ రావడంతో ప్రయాణీకులు చైన్ లాగారు. బీబీనగర్ రైల్వే స్టేషన్ లో ఈ రైలును నిలిపివేశారు.
![smoke detected in secunderabad-sirpur kagaznagar train lns smoke detected in secunderabad-sirpur kagaznagar train lns](https://static-ai.asianetnews.com/images/01hfexn2rcrade8jgyqfnazdec/new-trains-next-5-years-1700234169100_363x203xt.jpg)
బీబీనగర్: సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ రైలులో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పొగలు వస్తున్న విషయాన్ని ప్రయాణీకులు గుర్తించారు.వెంటనే రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. బ్రేక్ లైనర్ పట్టేయడంతో రైలులో పొగలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. బీబీనగర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహించారు. మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత తిరిగి రైలును పంపించివేశారు.
గతంలో కూడ పలు రైళ్లలో మంటలు వ్యాపించడంతో పాటు పొగలు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2023 ఆగస్టు 13వ తేదీన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి.దీంతో స్టేషన్ఘన్పూర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. ఈ రైలుకు చెందిన నాలుగో కోచ్ నుండి పొగలు రావడంతో గుర్తించిన ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. మరమ్మతులు నిర్వహించిన తర్వాత రైలును తిరిగి పంపారు. ఇంటర్ సిటీ రైలులో 2021 జూన్ 16న కూడ పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేటు వద్ద రైలు ఇంజన్ లో పొగలు వచ్చిన విషయాన్ని గుర్తించి నిలిపివేశారు.
నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మహబూబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.అహ్మదాబాద్ నుండి చెన్నైకి రైలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
2022 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు మంటలు రావడంతో రైల్వే సిబ్బంది గుర్తించి మంటలను ఆర్పారు. మంటలను ఆర్పేందుకు గూడూరు రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేశారు.
2022 జూన్ 27న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. దీంతో డోర్నకల్ రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేశారు. పొగలు వ్యాపించిన బోగీలను వేరు చేసి మరో బోగీలోకి తరలించారు.