తెలంగాణ రాష్ట్ర పర్యాటక, యువజనశాఖ కార్యదర్శి పనిచేస్తున్న స్మితా సభర్వాల్‌ గత కొంతకాలంగా వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ మంత్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈక్రమంలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై ఏఐకి చెందిన ఫొటోని షేర్‌ చేసి వివాదాల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెను వేరే శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో మరోసారి ఆమె సంచలన ట్వీట్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 20 ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రధానంగా కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో కొందరు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో అలాంటి వారిని బదిలీలు చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ను ప్రాముఖ్యత లేని, సచివాలయం వెలుపల పనిచేసే కార్యాలయంలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది. 


స్మితా సబర్వాల్‌ను ఆమె గతంలో పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో చేసిన రీ పోస్ట్‌పై వివాదం చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆమెపై తీవ్రస్థాయిలో  విమర్శలు వచ్చాయి. దీంతో సచివాలయం బయట ఉండే ఆర్థిక కమిషన్‌ కార్యాలయానికి ఆమెను బదిలీ చేశారు. తెలుస్తోంది. స్వయంకృతంవల్లే మళ్ళీ డిమోషన్ అయినట్లు సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. ఆమె మంగళవారం ఆర్థిక కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ట్వీట్‌ చేయడం ఆ కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

స్మితపై బదిలీ వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్‌ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత.. ఇలా రాసుకొచ్చారు. ''4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని పేర్కొన్నారు. 

‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు.

ఇక స్మిత సబర్మాల్‌ చేసిన ట్వీట్‌పై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఆమె పేర్కొన్న శ్లోకం తెలుగులో అర్థం ఇదే.. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన అని పేర్కొనగా.. దీని అర్థం.. ''నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి”.
 
అయితే.. గత కొంత కాలంగా విధుల్లో స్మితాసభర్వాల్‌ నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు చెబుతున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్నీ పెండింగులోనే పెట్టారని… సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్‌గా రావడంలేని ఉద్యోగులే మాట్లాడుకోవడం గమనార్హం.