తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా (khammam district) కారేపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే…. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సీఎం కేసీఆర్ ఫోటోను ఎడిట్ చేశాడు. దాన్ని ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడుకు చెందిన పొన్నెకంటి సురేష్, కారేపల్లి మండలం బొక్కల తండాకు చెందిన హట్కర్ రాంబాబుకు పంపాడు. ఆ ఇమేజ్ ను రాంబాబు… భద్రాద్రి కొత్త గూడెం జిల్లా (bhadradri kothagudem) టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం… కొత్త పోచారానికి చెందిన కొండమీది కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏలూరు గూడెంకు చెందిన నేల మర్రి నారాయణ, పాతర్లపాడుకు చెందిన నాగేంద్రయ్యలు వివిధ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు.

దీనిని గమనించిన కారేపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత అజ్మీరా వీరన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరందరినీ ఫోన్ నెంబర్లు ఆధారంగా అదుపులోకి తీసుకుని ఇల్లెందు కోర్టులో హజరు పరిచారు. అలాగే ట్విట్టర్‌లోని ఒక న్యూస్ వెబ్‌సైట్ పేరుతో ఉన్న ఖాతాలో సీఎం కేసీఆర్‌ను దూషిస్తూ పోస్టు పెట్టారని… ఫేస్‌బుక్‌లో అశోక్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ నేతలు హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.