హైదరాబాద్లో ఉదయం 4 గంటల వరకు బార్లు ఓపెన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad: ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్థరాత్రి తర్వాత జరిగే మ్యాచ్లను వీక్షించే వారి కోసం కొన్ని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు సమయం పొడగిస్తూ ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

ఫిఫా మ్యాచ్ల కోసం ప్రత్యేక అనుమతి
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్లో కీలక పోటీలు అర్థరాత్రి తర్వాత జరగనున్న నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన ఎక్సైజ్ శాఖ, క్రీడాభిమానులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆల్కహాల్ విక్రయాల సమయాన్ని తాత్కాలికంగా పొడిగించాలని నిర్ణయించింది.
ఏ రోజున ఎంత వరకు అనుమతి?
జూలై 19న జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలు తెల్లవారుజామున 4:30 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అదే విధంగా జూలై 20న జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలకు అనుమతి కల్పించారు.
ఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్ పోరు
జూలై 20న అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న యార్క్ స్టేడియంలో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ కోసం అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్పై భారీ ఆసక్తి నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అభిమానుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఎక్కడ వర్తిస్తుంది.. ఎలాంటి నిబంధనలు?
ఈ ప్రత్యేక అనుమతి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ కలిగిన బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ సమయాలే అమల్లో ఉంటాయి. అనుమతించిన సమయాన్ని మించి ఆల్కహాల్ విక్రయాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

