ఇంటివద్దకే స్వచ్చమైన మామిడిపండ్లు...వెబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి సింగిరెడ్డి
లాక్ డౌన్ సమయంలో ఇంటివద్దకే స్వచ్చమైన మామిడిపళ్లను అందించే ఉద్దేశంతో రూపొందించిన వెబ్ పోర్టల్ ని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
హైదరాబాద్: కరోనా విజృంభణ, లాక్ డౌన్ ఆంక్షల కారణంగా బయటకు రాలేకపోతున్న వారికి ఇంటికే తాజా పండ్లను అందించాలన్న ఉద్దేశంతో రూపొందించిన వెబ్ పోర్టల్ ను వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అగ్రోస్ సహకారంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లకు సేంద్రీయ మామిడిపండ్లు అందిస్తున్న www.cropmandi.com సేవలను మంత్రి ప్రారంభించారు.
కరోనా సంక్షోభ సమయంలో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడమే కాకుండా వాటిని వినియోగదారులకు చేరుస్తున్నందుకు పోర్టల్ నిర్వాహకులు లగ్గాని శ్రీనివాస్ ను మంత్రి అభినందించారు. కరోనాతో అన్ని రంగాలలో సంక్షోభం నెలకొందని...ఈ కష్టకాలంలో ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి అందరం బాసటగా నిలవాల్సిన సమయమిదని మంత్రి పేర్కొన్నారు.
మామిడి, బత్తాయి తదితర పంటలను వినియోగదారుల ఇంటికే తరలించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు వాటి సహకారంతో అనేక ఇతర సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులలో ఈ విధంగా అందరూ ముందుకు వచ్చి రైతులకు తోడ్పాటునివ్వడం సంతోషించదగ్గ విషయమని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.