రూ.10 కట్ చేశారని, రూ. 10వేలు జరిమానా.. హైదరాబాద్ మెట్రోకు షాకింగ్ పనిష్మెంట్...
ఓ కేసులో ప్రయాణికుడికి పదివేల రూపాయల జరిమానా చెల్లించాలని హైదరాబాద్ మెట్రోకు వినియోగదారుల కమిషన్ సూచించింది.

ఖమ్మం : హైదరాబాద్ మెట్రోకు ఎదురు దెబ్బ తగిలింది. వినియోగదారుల కోర్టులో ఊహించని జరిమానా పడింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే మెట్రో.. ఓ ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టిన కేసులో ఈ జరిమానా ఎదుర్కొంది. సదరు ప్రయాణికుడి మెట్రో కార్డు నుంచి రూ.10 కట్ చేసినందుకు.. పదివేల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరగగా తాజాగా దీనిమీద తీర్పు వెలువరించింది కోర్టు.
2019 జనవరి 10వ తేదీన ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ మెట్రో రైల్ ఎక్కడం కోసం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లోకి వచ్చారు. తాను వెళ్లాల్సిన తూర్పు వైపు దారిలో టాయిలెట్స్ కనిపించలేదు. దీంతో మరోవైపు వెళ్ళాడు. దీంతో మెట్రో కార్డును మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. .అక్కడ టాయిలెట్స్ వాడుకున్న తర్వాత.. తిరిగి మళ్ళీ రావడం కోసం మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. దీంతో అతని మెట్రో కార్డు నుంచి రూ.10 కట్ చేసింది హైదరాబాద్ మెట్రో.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: గణేష్ శోభాయాత్రను పరిశీలించిన తలసాని
రోజు వేలాదిమందికి ఇలాగే జరుగుతుందని గమనించిన నరేంద్రస్వరూప్.. ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్ లో దీనిమీద ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్ల క్రితం చేసిన ఈ ఫిర్యాదులో తాజాగా పరిశీలన జరిగింది. ఈ కేసును పరిశీలించిన కమిషన్ చైర్మన్ వీ లలిత, సభ్యురాలు ఏ. మాధవి లత.. న్యాయవాది నుంచి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇవ్వడమే కాకుండా.. అసౌకర్యానికి గురి చేసినందుకు రూ.5వేలు, కోర్టు ఖర్చులకోసం మరో రూ. 5000 చెల్లించాలని బుధవారం నాడు తీర్పునిచ్చారు.
45 రోజుల్లోగా ఈ పరిహారాన్ని బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భాల్లో డిస్ప్లే బోర్డుల్లో ప్రయాణికులకు కనిపించేలా సూచనలు పెట్టాలని ఖమ్మం వినియోగదారుల కమిషన్ హైదరాబాద్ మెట్రోకు సూచించింది.