కావాల్సింది భజన కాదు హైకోర్టు విభజన
అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను 100 రోజుల్లో విభజిస్తామన్న కమలనాథులు మూడేళ్లుగా అధికారం అనుభవిస్తున్నా కనీసం హైకోర్టును కూడా విభజించడం లేదు.
ఉత్తరాదిన మునుపెన్నడూ లేనంత ఆధిపత్యం సాధించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టంతా దక్షణాదిపైనే పెట్టింది. అందులో భాగమే అమిత్ షా తెలంగాణ పర్యటన.
ప్రత్యేక తెలంగాణకు తాము మొదటి నుంచి మద్దతిచ్చామని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రాష్ట్రంలో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
అయితే కమలనాథుల కలకు విభజన సమస్యలే అడ్డుతగులున్నాయి.
తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న పార్టీ యూపీఏ హయాంలో వచ్చిన తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడానికి కూడా మనస్సొప్పడం లేదు.
మూడేళ్ల నుంచి తెలంగాణ సమాజం, ప్రజాప్రతినిధులు ఎన్ని విన్నపాలు చేసినా ఉద్యమాలకు దిగినా హైకోర్టు విభజనకు మాత్రం బీజేపీ ముందుకు రావడం లేదు. ఇదొక్కటే కాదు విభజన చట్టంలో ఉన్న ఏ హామీని అధికార బీజేపీ సరిగా నెరవేర్చలేదు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలే చొరవతీసుకొని నీటిజలాల పంపిణీ, ఉద్యోగుల విభజనపై చర్చించుకుంటుంటే కేంద్రం మాత్రం మౌనంగా చూస్తోంది.
ఇక హైకోర్టు విభజన గురించి కేంద్రం పూర్తిగా మరిచిపోయినట్లుంది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ రాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్రమంత్రులను కూడా అనేకసార్లు కలిశారు. అయినా పరిస్థితిలో ఏ మార్పులేదు.
పెద్దన్న పాత్ర పోషించి రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన బీజేపీ నేతలు ఇప్పుడు సమస్యలు మరిచి అధికారం కోసం ఇలా పర్యటనలు జరపడం, రాష్ట్ర ప్రభుత్వాలను దుమ్మెత్తిపోయడం చూస్తుంటే విస్మయం కలిగిస్తోంది.