చావైనా రేవైనా కాంగ్రెస్తోనే.. ఠాగూర్తో నాది మంచి రిలేషన్: పార్టీ మార్పుపై తేల్చేసిన మహేశ్వర్ రెడ్డి
పార్టీ మార్పుపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి. చావైనా రేవైనా కాంగ్రెస్తోనే తేల్చుకుంటానని, పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్లోనే తనకు గౌరవం వుందన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి. తాను కాంగ్రెస్ను వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్లోనే అని నిర్ణయం తీసుకున్నానని.. తాను ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వస్తోన్న వార్తలు అవాస్తవలని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరికీ లేఖ రాయలేదని.. ఏదైనా వుంటే సమావేశంలోనే చర్చిస్తానని, రాజీనామా విషయం కూడా సిబ్బందితో చర్చించాకే బయటకు వచ్చిందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
చావైనా రేవైనా కాంగ్రెస్తోనే తేల్చుకుంటానని, పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో 170 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఎన్నికల వ్యూహాం కూడా సిద్ధం చేస్తున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీ మాణిక్యం ఠాగూర్తో తనకు అనుబంధం వుందని, అన్ని మాట్లాడుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. లోపల మాట్లాడుకునే విషయాలు బయటకొస్తేనే చర్చకు దారితీస్తాయని మాణిక్యం ఠాగూర్ హెచ్చరించారు.
ALso Read:టీ కాంగ్రెస్ను వెంటాడుతున్న కష్టాలు.. పార్టీ తీరుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి!
ఇకపోతే... తెలంగాణ కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. తాజాగా కాంగ్రెస్కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. అయితే ఏఐసీసీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది.