టీ కాంగ్రెస్ను వెంటాడుతున్న కష్టాలు.. పార్టీ తీరుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి!
తెలంగాణ కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
తెలంగాణ కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. తాజాగా కాంగ్రెస్కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. అయితే ఏఐసీసీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారంపై మహేశ్వర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ రోజు మాణిక్కం ఠాగూర్తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అంతర్గతంగా చర్చిస్తానని తెలిపారు. అయితే తాను రాజీనామా చేస్తున్నానని వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్లోనే కార్యకర్తగా కొనసాగుతానని పేర్కొన్నారు.
ఇక, గతంలో మహేశ్వర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. పన్నుల భారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.