రేపు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానుండటంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సెక్యూరిటీని పర్యవేక్షించనున్నాయి.  

రేపు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానుండటంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ప్రధాని భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సెక్యూరిటీని పర్యవేక్షించనున్నాయి. ప్రధాని రాక నేపథ్యంలో బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బేగంపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్స్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతాలను ఇప్పటికే ఎస్‌పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. 

శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. 7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని రేపు భూమిపూజ చేయనున్నారు.

మోడీ పర్యటనలో ప‌లు అభివృద్ధి పనులు, శంకుస్థాప‌న‌లు 

రాష్ట్రంలో మరో ఆరు జాతీయ రహదారుల విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోని పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఇంతక ముందే మంజూరు చేసింది. విస్తరణ ప్రణాళికలు కొలిక్కిరావటంతో పాటు భూసేకరణ ప్రక్రియ ఎక్కువ భాగం పూర్తి అయినందున శంకుస్థాపనకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమైంది. ఆరు రహదారుల విస్తరణకు రూ.7,864 కోట్లలతో వ్యయం కానుంది. పనులకు టెండర్ల ప్రక్రియను కూడా అధికారులు చేపట్టారు.

వందే భార‌త్ రైలు ప్రారంభం.. 

రాష్ట్రంలో వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రెండో రైలును ప్ర‌ధాని త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్రారంభించ‌నున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపైకి వచ్చింది. రేపు సికింద్రాబాద్‌లోని ప్లాట్‌ఫామ్‌ 10 నుంచి ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌- తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.