ఎస్సీ వర్గీకరణపై ఈనెల 5న ఢిల్లీకి అఖిలపక్షం
రాష్ట్రంలో చాలా ఏళ్లుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణకు ముగింపు పలికేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 5 న ఢిల్లీకి అన్ని పార్టీలతో కలిసి వెళ్దామని వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు.గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో చర్చించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణపై ఇటీవల దళిత సంఘాల నుంచి తీవ్ర ఒత్తడి వస్తున్న విషయం తెలిసిందే. వర్గీకరణ కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్ అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్ర మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎ్సఎఫ్) ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులు ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా కూడా నిర్వహించారు.
ఇక మంద కృష్ణ మాదిగ ఇటీవల సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
అయితే, సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. అక్కడే ఎస్సీ వర్గీకరణ ను తేల్చాలని భావిస్తున్నారు.
