ఢిల్లీలోనే రఫికతో సంజయ్ కు సాన్నిహిత్యం: ఆమె భర్త మిస్టరీ?
గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో నిందితుడైన సంజయ్ కుమార్ తన ప్రేయసి రఫిక భర్తను ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రఫికను ఢిల్లీ నుంచి సంజయ్ వరంగల్ కు తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు.
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన 9 మంది హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంజయ్ కుమార్ యాదవ్ అనే యువకుడు గీసుకొండ మండలం గొర్రెకుంటలో చంపేసి, వారిని బావిలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అంతకు ముందు తన ప్రేయసి రఫిక అలియాస్ ఛోటీని అతను నిడదవోలు వద్ద రైలులో చంపేసి కిందికి విసిరేసినట్లు కూడా గుర్తించారు.
రఫికకు కూతురు సిర్దాన్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మక్సూద్ కుటుంబ సభ్యులు కూడా మృతి చెందడంతో వారికి దిక్కు లేకుండా పోయింది. రఫిక భర్త ఏమయ్యాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతన్ని కూడా సంజయ్ కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: గొర్రెకుంట బావిలో 9 డెడ్బాడీలు: సంజయ్ సెల్ఫోన్లో ఆశ్లీల వీడియోలు
ఢిల్లీలో ఫర్నిచర్ షాపులో పనిచేసినప్పుడు రఫికతో సంజయ్ కు పరిచయం ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. అతనితో పెరిగిన సాన్నిహిత్యం కారణంగా రఫిక ఢిల్లీ నుంచి పిల్లలతో సహా వరంగల్ కు మకాం మార్చిందంటున్నారు. మక్సూద్ కూడా తన కూతురు బుష్రాను ఢిల్లీలో ఖాతూన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఢిల్లీ వ్యవహారం తెలియడంతో వరంగల్ వచ్చిన తర్వాత మక్సూద్ పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.
దాంతో స్తంభంపల్లిలో రఫిక సంజయ్ కుమార్ యాదవ్ తో కాపురం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, మక్సూద్ భార్య నిషా ఆలం తన సోదరి కూతురు కావడంతో రఫికను అప్పుడప్పుడు కలిసేదని చెబుతున్నారు. చివరకు రఫిక ఆచూకీ గురించి పదే పదే నిలదీయడంతో సంజయ్ మక్సూద్ కుటుంబాన్ని అంతం చేసినట్లు చెబుతున్నారు
Also Read: గొర్రెకుంట సామూహిక హత్యలు: అతన్ని సైకిల్ సవారీయే పట్టించింది
రఫిక కుటుంబ సభ్యులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ కుమార్ నేర చరిత్రపైనా కూపీ లాగుతున్నారు. సంజయ్ కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సంజయ్ కుమార్ ను మరోసారి విచారించేందుకు పోలీసులు అతని కస్డడీని కోరే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే, రఫిక భర్త బతికే ఉన్నాడని, ఆనయ మానసిక స్థితి బాగా లేదని ప్రచారం సాగుతోంది. రఫిక భర్తపై స్పష్టత వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రఫిక పిల్లలకు గీసుకొండ పోలీసులు రక్షణ కల్పించారు. సిర్దాన్ ను హన్మకొండలోని సుబేదారిలో గల సఖి సెంటర్ లో, ఇద్దరు కుమారులను వరంగల్ లోని ఆటో నగర్ లో గల జువెనైల్ హోంకు తరలించారు. వారిని కలవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి రఫిక మేనమామ, మరో మగ్గురు బంధువులు బుధవారం వచ్చారు. వారిని తీసుకుని వెళ్లి పోషిస్తామని వారు చెప్పగా అందుకు కోర్టు అనుమతి అవసరమని పోలీసులు చెప్పారు. వారిని పోషించే స్తోమత మీకుందని కోర్టు నమ్మితే అందుకు అనుమతిస్తుందని చెప్పారు.