టీఎస్ఆర్టీసీ సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ మంత్రి కేటీఆర్ తోనూ మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదని పవన్ కల్యాణ్ చెప్పారు.

అమరావతి: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీ రామారావుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక నేతలు ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసి ఆయన మద్దతు కోరిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడుతానని ఆయన కార్మిక నేతలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ సమ్మె విషయంలో తాను టీఆర్ఎస్ నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తీరుతో ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. 

తాను కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించానని, కానీ వారి అపాయింట్ మెంట్ దొరకలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖపట్నం లాంగ్ మార్చ్ తర్వాత హైదరాబాదులో కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ కార్మికులకు తమ పార్టీ జనసేన అండగా ఉంటుందని ఆయన చెప్పారు. 

Also Read: కేసీఆర్ ను కలిసి చర్చిస్తా, పట్టించుకోకపోతే....: పవన్ కళ్యాణ్

కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కల్యాణ్ తనను కలిసిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ అంటే తనకు ఎంతో గౌరవమని, సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెపై, కార్మికుల డిమాండ్లపై రెండు రోజుల్లో కేసీఆర్ ను కలిసి మాట్లాడుతానని కూడా ఆయన చెప్పారు. 

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు పవన్ కల్యాన్ కేసీఆర్ తోనూ, కేటీఆర్ తోనూ మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కల్యాణ్ కు ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. అదే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారు.