RTC Strike: మహా దీక్ష నేపథ్యంలో మందకృష్ణ హౌస్ అరెస్ట్
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నేడు మంద కృష్ణ మాదిగ మహా ధర్నాకు పిలుపునిచ్చారు. హబ్సిగూడ లోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ని హౌజ్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నేడు మంద కృష్ణ మాదిగ మహా ధర్నాకు పిలుపునిచ్చారు. హబ్సిగూడ లోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ని హౌజ్ అరెస్ట్ చేశారు. మంద కృష్ణ మాదిగ మహా ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు.
ఇందిరాపార్కు వద్ద నేడు తలపెట్టిన ఈ మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తుగా అరెస్టులు చేసారు. ఈ క్రమంలో లోయర్ ట్యాంక్ బండ్ కు వచ్చే అన్ని రోడ్లను పోలీసు వారు ఇప్పటికే మూసివేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధనం చేసారు.
Also read: నన్ను అరెస్ట్ చేస్తే అత్మహత్య చేసుకుంటా!: RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి
మొన్న ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చినప్పుడు పోలీసు వారు ప్రాన్తఘాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నా, కార్మికులు కళ్లుగప్పి పోలీసు వలయాలను చేధించుకుంటూ ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు.
గతంలో జరిగినట్టుగా మరోమారు జరగకుండా, ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని పోలీసులు ఉదయం నుండే ఇందిరా పార్క్ కు వచ్చే రోడ్లన్నింటిని మూసివేశారు.
గత నెల రోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు విధుల్లోకి చేరేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతూనే ఉంది. కాగా.. ప్రభుత్వం తమ సమ్మెను పట్టించుకోని నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ దీక్షకు పిలుపునిచ్చింది.
Also read: ఆర్టీసీ దీక్ష.. అశ్వత్దామ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం
ఇదిలా ఉండగా... ఇటీవల ఈ సమ్మె విషయంపై అశ్వత్దామ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విలీనం అంశం విఘాతం కలిగిస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నేపథ్యంలోనే విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదే సమయంలో మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని కోరుతున్నామని... ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఆత్మస్ధైర్యాన్ని కోల్పోవద్దని.. శుక్రవారం డిపోల నుంచి గ్రామాలకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
16న నిరవధిక దీక్ష, బస్సులను ఆపే కార్యక్రమం, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్ టూ కోదాడ బంద్ నిర్వహిస్తామన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.
రేపో ,ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్ ను కలుస్తామని.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు,కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు.
ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని.. సడక్ బంద్ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని అశ్వత్థామరెడ్డి విజ్ఙప్తి చేశారు.