ఆర్టీసీ విలీనం బిల్లు పెండింగ్: తమిళిసైపై కార్మికుల గుస్సా
ఆర్టీసీ వీలిన బిల్లుకు గర్నవర్ తమిళసై నేటి మధ్యాహ్నం వరకు ఆమోదముద్ర వేయాలని, తిరిగి ప్రభుత్వానికి పంపాలని టీఎంయూ నాయకులు డిమాండ్ చేశారు.లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
తెలంగాణ మంత్రి వర్గం ఆమోదించిన ఆర్టీసీ కార్మికులు విలీన బిల్లును గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. దీంతో కార్మికులంతా ఆగ్రహంతో ఉన్నారు. గురువారం మధ్యాహ్నానికల్లా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆ బిల్లుకు ఆమోదముద్ర వేసి ప్రభుత్వానికి తిప్పి పంపకపోతే మరోసారి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.
అయితే ఆ బిల్లు గవర్నర్ ఆమోదిస్తారని, ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తిరిగి పంపుతారని రాజ్ భవన్ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చే) బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంలో జాప్యంపై ఉద్యోగులు మండిపడుతున్న నేపథ్యంలో గత సోమవారం సాయంత్రమే గవర్నర్ ఆమోదం కోసం బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపినట్లు రాజ్ భవన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి.
ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చే సమయంలో తాను చేసిన 10 సిఫార్సులను ప్రస్తావించకుండానే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత వెనక్కి పంపడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘సిఫార్సులపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. వాటిని పరిగణనలోకి తీసుకుంటారని కూడా కాదు. ఆమె ఈ కోణాన్ని పరిశీలించాలనుకుంటున్నారు.’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. ఆర్టీసీ బిల్లుకు తాను వ్యతిరేకం కాదని ఇటీవల గవర్నర్ ప్రకటించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా ఆ బిల్లకు ఆమోదం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
బిల్లుకు ఆమోదంపై జరుగుతున్న జాప్యంపై టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై తక్షణమే స్పందించాలని గవర్నర్ ను కోరారు. ప్రభుత్వం పంపించిన విలీన బిల్లును గవర్నర్ ఆమోదించి, గురువారం మధ్యాహ్నానికల్లా ప్రభుత్వానికి పంపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఆమోదం తెలిపకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడంతో 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో టీఎంయూ సభ్యులను చేర్చాలని కోరారు.