త్రిసభ్య కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం: ఈనెల 5 నుంచి సమ్మె
సమ్మె ఇల్లీగల్ అంటూ లేబర్ కమిషన్ పేరుతో భయపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు మెక్కవోని ధైర్యంతో సమ్మెకు వెళ్తామని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రభుత్వం నియమించిన త్రి సభ్య కమిటీల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఆర్టీసీ జేఏసీ నేతలు పెట్టిన డిమాండ్లపై త్రిసభ్య కమిటీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మెకు వెళ్లడం తప్పనిసరి అని స్పష్టం చేశారు జేఏసీ నేతలు. ఈనెల 5 నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు కాస్త ఓపిక పట్టాలని కోరారు త్రి సభ్య కమిటీ సభ్యులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
కార్మికులు పెట్టిన 26 డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు. దసరా సమయంలో సమ్మె వద్దని జేఏసీ నేతలకు సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ బద్దంగా ఐఏఎస్ లతో కమిటీ వేశారని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని తెలిపారు.
కార్మికుల డిమాండ్లలోని ప్రతీ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ. అయితే కమిటీ డిమాండ్లపై చర్చించేందుకు కాస్త సమయం అవసరం ఉంటుందని ఈ నేపథ్యంలో అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుపై ఎర్రమంజిల్ లోని ఆర్టీసీ కార్యాలయంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. 26 డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు జేఏసీ నేతలు. అయితే అధికారులతో చర్చలు సఫలం కాకపోవడంతో ఈనెల 5న సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు.
తమడిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు చాలా చిన్నవేనని అయితే యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవడం లేదన్నారు.
సమ్మె ఇల్లీగల్ అంటూ లేబర్ కమిషన్ పేరుతో భయపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు మెక్కవోని ధైర్యంతో సమ్మెకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీకి చట్టబద్దత లేదన్నారు.
తాము ఇచ్చిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తమని కమిటీ సభ్యులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమిటీకి చట్టబద్దత లేదన్నారు. ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము వెనకడుగు వేసేది లేదన్నారు జేఏసీ నేతలు
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీ సమ్మె: సీనియర్ ఐఎఎస్లతో కమిటీ వేసిన తెలంగాణసర్కార్