నిజామాబాద్ కండక్టర్ పై సోషల్ మీడియా కేసు
విజిలెన్స్ విచారణ కోరిన డిపో మేనేజర్
సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు తెలంగాణ సర్కారు రంగంలోకి దిగింది. సిఎం కేసిఆర్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిని వదిలే ప్రశ్నే లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఆరా తీస్తోంది.
నిజామాబాద్ ఆర్టీసి డిపో 1 లో పనిచేస్తున్న సంజీవ్ అనే కండక్టర్ పై విజిలెన్స్ విచారణ జరపాలంటూ ఆ డిపో మేనేజర్ లేఖ రాశారు. ఈ లేఖను ఈనెల 4వ తేదీన కరీంనగర్ జోనల్ విజిలెన్స్ అధికారులకు రాశారు. నిజామాబాద్ డిపో 1లో పనిచేసే కండక్టర్ సంజీవ్ తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ సిఎం కేసిఆర్ మీద, ఆర్టీసి ఉన్నతాధికారుల మీద అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు వచ్చాయన్న మేనేజర్ సంబంధిత కండక్టర్ మీద విజిలెన్స్ విచారణ జరపాలంటూ లేఖలో కోరారు.
ఈనెల 4వ తేదీన రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవన్న సర్కారు హెచ్చరికలు అమలులోకి వచ్చాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి