మరో పదిమంది పరిస్థితి విషమం

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానుకొండూరు మండలం చెంజర్ల వద్ద ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు.. లారీ ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. అందులో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మానురకొండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఏరియా ఆస్పత్రికి గానీ, హైదరాబాద్ కు గానీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక చాలామంది ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇక ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రమాద స్థలంలోను మృతి చెందాడు. లారీ ముందు భాగం నుజ్జు నుజ్జవడంతో ఇతడి మృతదేహం అందులోనే చిక్కుకుంది. ఈ మృతదేహాన్ని బైటికి తీయడానికి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మృతులంతా జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా ప్రాథమికంగా తెలుస్తుంది.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్బ్రాంది వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో మంత్రి ఈటల రాజేందర్ చెంజర్లకు బయలుదేరారు.

ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలతో పాటు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.