హైదరాబాద్ లో ఘోర రోడ్డుప్రమాదం... కారును ఢీకొన్న టిప్పర్, హెడ్ కానిస్టేబుల్ మృతి
తెెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డాడు.
హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా ఓ టిప్పర్ లారీ రూపంలో అతడిని మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈశ్వరయ్య(45) హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. జగద్గిరిగుట్టలోని ఆల్విన్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్న అతడు శంషాబాద్ కు ప్రతిరోజూ వెళ్లివచ్చేవాడు. ఇలా నిన్న(మంగళవారం) కూడా ఉదయం డ్యూటీకి వెళ్లిన అతడు విధులు ముగించుకుని అర్ధరాత్రి తన కారులో ఇంటికి బయలుదేరాడు.
read more రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన బస్సు, కారు డ్రైవర్ మృతి
read moreహైదరాబాద్: గూగుల్ సిగ్నల్ వద్ద బైక్పై దూసుకెళ్లిన కారు ... యువతి మృతి
మరికొద్దిసేపట్లో ఇంటకి చేరుకుంటాడనగా ఈశ్వరయ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. అతివేగంతో వచ్చిన ఓ టిప్పర్ లారీ కూకట్పల్లి ఫోరం మాల్ వంతెనపై ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్యను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే అతడు తీవ్రంగా గాయపడటంతో వైద్యులు మెరుగైన చికిత్స అందించినా కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఈశ్వరయ్య ప్రాణాలు వదిలాడు.
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అప్పటికే ఈశ్వరయ్యను హాస్పిటల్ కు తరలించారు. దీంతో రోడ్డుపై నుండి వాహనాలను పక్కకు తొలగించారు పోలీసులు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.